Pages

Santhoshimatha Vrata Katha

Santhoshimatha Vrata Katha
Santhoshimatha Vrata Katha
శ్రీ సంతోషిమాతా వ్రత కథ:
Santhoshi Matha Vrat Katha, Story of Santhoshi Matha Vrat

పూర్వము చంపక దేశంలో శోభానగారమనే పెద్ద పట్టణములో ఒక వృద్ద స్త్రీ నివసించేది. ఆమెకు ఏడుగురు కొడుకులు.  ఆ ఏడుగురిలోను ఆరుగురు ఏవో చక్కటి పనులలోను, ఉద్యోగాలలోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తున్నారు. ఏడవవాడైన శ్రీకరుడు ఏ పనీ చేయకుండా సోమరిపోతై , సంపాదన లేకుండా తిరగసాగాడు.  అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు.  చివరకు కన్న తల్లి కూడా అతనిని హీనంగా చూసేది.

సంపాదించే కొడుకులకు షడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి, ఎంగిలి పదార్ధాలను శ్రీకరునికి పెట్టేది.  ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడే ఆహారంగా బ్రతుకుతున్నాడు.  క్రమముగా అన్నదమ్ములు ఏడుగురికి పెళ్ళిళ్ళు జరిగాయి.  పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు.  సంపాదన లేనివాడూ, సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి  తింటూ, దానినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు.

ఆ ముదుసలి చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకరుని భార్యయైన కల్యాణి గమనిస్తుంది.  ఒకరోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి ఆమె తనకు పెట్టే ఆహారము గురించి గొప్పలు చెప్పసాగాడు.  అది విని కల్యాణి ఉండబట్టలేక "ఓ స్వామీ! మీ తల్లి గారు మీకు ఎటువంటి ఆహారము పెడుతున్నారో తెలియక, ఇలా మాట్లాడుతున్నారు.  చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది.  అని చెప్పింది.

"సరే! చూస్తాను! నువ్వు చెప్పినమాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు" అని భార్యను హెచ్చరించి, శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్ట సాగాడు. ఒక రోజున పెద్దకొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ ముసలి వారందరికి మధురమైన మిఠాయిలు వగైరా పిండి పదార్ధాలు చేసి పెట్టింది.  శ్రీకరుడిని పిలువలేదు.  శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతున్నాడు. పెద్ద కొడుకులూ కోడళ్ళూ మొత్తం పన్నెండుగురూ భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తళ్ళల్లో  పారేసిన పదార్ధాలు ఏరి వేరే విస్తరిలో పెట్టింది. పిదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరకు వెళ్లి "నాయనా! నీ అన్నయ్యలు వదినలూ భోజనం చేశారు. ఇక నువ్వు, మీ యావిడ మాత్రమె మిగిలారు వచ్చి తినండి అంటూ పిలిచింది.  శ్రీకరుడు విస్తరిదగ్గరకు వెళ్లి  అందులోని పదార్ధాలు అన్నీ తన అన్నలూ వదినలూ తిని వదిలివేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు.  అందుకు అతను ఎంతో బాధపడ్డాడు. తనకూ, తన భార్యకూ ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధ పడ్డాడు. కళ్యాణి అతనిని ఓదార్చింది.

ఓ ప్రాణేశ్వరా! ధనమూలం ఇదం జగత్, డబ్బులు లేక పోతే అందరు ఇలాగే చూస్తారు.  అన్నింటికీ మూలం ధనం, ఇదే మీరు సంపాదనా పరులైతే మన పరిస్థితి మరోలా వుండేది.  అని హితవు చెప్పింది.  భార్య మాటలు శ్రీ కరుడికి నచ్చినవి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు. మరునాడు ఉదయము తల్లి దగ్గరకు వెళ్లి "అమ్మా! డబ్బు సంపాదించడము కోసం పరాయి దేశాలకు వెళ్లాలని ఉంది" అన్నాడు. చాలా మంచిది నాయనా  వెంటనే వెళ్ళిపో అంది.  శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు. అప్పుడామే పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతోంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరము ఆమె చేతికిచ్చి నా గుర్తుగా ఇది నీదగ్గర ఉంచు అని చెప్పి, మరి నీ గుర్తుగా ఏమైనా ఈయవా! అనిఅదిగినాడు. అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథా!  మీకు ఇచ్చేందుకు నాదగ్గర ఏమీ లేదు.  అయిననూ ప్రేమగా అడిగారు గనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రముపై గుర్తుగా వేసింది. అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్ధం చేసుకున్నాడు. సంతోషముగా పరదేశములకు ప్రయాణమైనాడు.

కొన్నాళ్ళకతడు పరాయి దేశము చేరి, అందొక పట్టణమునకు వెళ్లి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా వుద్యోగమిప్పించమని ప్రాధేయపడ్డాడు.  అప్పుడు ఆవ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలెను సుమా అని హెచ్చరించి, శ్రీకరునకు తనవద్ద ఉద్యోగము ఇచ్చాడు.  శ్రీకరుడు ఉద్యోగములో చేరి ఎంతయో నమ్మకముగా పనిచేయసాగాడు. అతని పనితనమునకు, విశ్వాసపాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరునకు తన వ్యాపారములో కొంచెము వాటాకూడా ఇచ్చాడు.  శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును వృద్ది చేసాడు. అట్లు పన్నెండు సంవత్సరములు గడచిపోయినవి. వ్యాపారి ముసలి వాడై పోయెను. అందువలన తనవాటా ధనము మాత్రం తాను తీసుకొని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరునకే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకోసాగెను.  శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యేను.  అమితమైన ధనవంతుడై సుఖముగా కాలము గడపసాగెను.

 ఇచ్చట అత్తవారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగెను. అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచుండెను. ఇంటి పనినంతయు చేయించుకొని, కనీసము కొద్దిగా అన్నము కూడా పెట్టదాయెను.  అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి, అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారము గడుపుచుండెను. ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వచ్చునా?  తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె ఎంతయో ఎదురు చూడసాగింది. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని, తలపై పెట్టుకొని వచ్చుచుండగా మధ్యలో ఆమెకు దాహము వేసినది.  చేరువ  గ్రామము వచ్చు వరకు ఓపికతో నడిచినది.  ఆ గ్రామము లోనికి రాగానే ఒకరి ఇంటికి వెళ్లి మంచినీళ్ళు అడగబోయినది. ఆ సమయముననే ఇంటివారు సంతోషిమాత వ్రతము చేసుకొనుచున్నారు.  ఆ వ్రతమును చూచుచు ఆమె దాహము మాటే మరచిపోయెను. ఆ పూజ మొత్తము పూర్తి అయిన తరువాత చివరలో కథను విని ప్రసాదము తీసుకున్నది.  తనకు కూడా ఆ వ్రతము చేయవలెనని కోరిక కలిగినది. ఆ వ్రత విధానము అంతయు వారిని అడగి తెలుసుకున్నది.

అందుకా ఇల్లాలు కల్యాణిని చూసి "ఓ సౌభాగ్యవతీ! ఇది సంతోషిమాతా వ్రతము. దీనిని ప్రతి శుక్రవారము నాడును శ్రద్దాభక్తులతో చేయవలెయును. అట్లు 40  శుక్రవారములు వ్రతము చేసి 41వ శుక్రవారమునాడు వుద్యాపనము చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహమువలన కోరిన కోరికలన్నీ తీరి నిత్యసంతోషులుగా జీవించగలుగుతారు. ఈ వ్రతము చేసే వారు శుక్రవారమునాడు పులుపు పదార్ధమును మాత్రం తినరాదు".  అంటూ నియమాలను, వుద్యాపనా విధానమును తెలిపినది.

కళ్యాణి ఆవిషయములన్నింటిని పూర్తిగా అర్ధము చేసుకొని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరినది. మార్గ మధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని, ఆమెకు కొంత ధనము అందించింది.  అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషముతో అదేరోజు సంతోషిమాత పూజ జరుపుకొన నిర్ణయించుకొని ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకొని బయలుదేరినది.  మార్గ మధ్యలో ఆమెకు ఒక దేవాలయము కనిపించినది.  అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయము ఏ దైవానిది అని అడుగగా, అక్కడివారు అది సంతోషిమాత దేవాలయము అని బడులిచ్చిరి. వెంటనే కళ్యాణి అమితమైన సంతోషముతో ఆ గుడిలోనికి వెళ్లి అమ్మవారిని దర్శనము చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్ధించి తాను తెచ్చిన పదార్ధములన్నియు అమ్మవారికి నివేదన గావించి, ప్రసాదము తీసుకొని ఇంటికి వెళ్ళినది.

అది మొదలు ఆమె ఎంతో నియమముగా ప్రతి శుక్రవారమునాడు సంతోషిమాతను పూజించుచూ వ్రత నియమములను తూచా తప్పకుండ పాటిస్తూ కాలము గడపసాగినది. ఇలా కొన్ని రోజులు గడుపగా ఒక శుక్ర వారము రాత్రి సంతోషిమాత కళ్యాణికి కలలో కనిపించి "అమ్మాయి! ఇదిగో నీభర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది".  కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడియున్నది.  ఆ అమ్మవారి దయకు, మహాత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామా లో వున్న విధముగానే తన భర్తకు ఉత్తరము వ్రాసింది.

అట్లు కళ్యాణి ఉత్తరము వ్రాసిన అనతికాలములోనే శ్రీకరుని వద్దనుండి ఆమెకు కొంచెము ధనము, ఉత్తరము వచ్చినవి. భర్త నుండి ఉత్తరము వచ్చుట తోడనే తన కష్టములు తీరినవని కళ్యాణి ఎంతగానో ఆనందించినది.  ఇది ఇట్లుండగా తన కోడలగు కళ్యాణికి ఎక్కడ నుండియో డబ్బులు, ఉత్తరములు వచ్చుచున్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడళ్ళతో  కూడబలుకుకొని అవి ఎచ్చటనుండి వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లలను పంపినారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్లి "పిన్నీ! నీకు ఉత్తరాలు, డబ్బులు ఎక్కడనుండి వస్తున్నాయి"?  అని అడుగగా, కళ్యాణి మీ పినతండ్రి గారి నుండియే వస్తున్నాయి"  అని నిజము చెప్పినది.  అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్లి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు.

పిల్లల అల్లరి అనందం చూశాక తమకు గూడా బిడ్డలుంటే బాగుండునని అనుకుంది. ఒకనాడు గుడికి వెళ్లి అమ్మవారి దర్శనము చేసుకుని "నన్ను కటిక దరిద్రమునుండి తప్పించావు. నీ దయవల్ల సుఖముగానే వున్నాను. కాని స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది.  కాని నాకు పిల్లలు లేరు.  కావున తల్లీ, నన్ను నాభర్త చెంతకు చేర్చు, మా కాపురం నిలబెట్టు, నాకు కడుపు పండేలా చేయి తల్లీ!  అని మరీ మరీ ప్రార్ధించింది. ఆ భక్తురాలి ధర్మ బద్దమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషిమాత ఒకనాటి రాత్రి శ్రీకరునకు బ్రాహ్మణ ముత్తైదువ రూపములో కలలో కనిపించి "శ్రీకరుడా!  నీవు వివాహితుడవు, నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగ్రామమునందు విడచివచ్చినావని మరచిపోయినావు. ధన సంపాదన ఒక్కటే జీవితముగా కాలము గడుపుచుంటివి. ఇట్లయినచో పెండ్లి ఏల చేసుకొంటివి?  నీ చెంతనే వుండవలేయునని, చిలకా గోరింక వలె కాపురం చేసుకోవలెనని ఆ పిల్లకు మాత్రము కోరికవుండదా?  కావున నీవు వెంటనే నీ స్వగ్రామమునకు ప్రయాణము కమ్ము. ఆమెనుకూడి సుఖముగా సంసారము చేసుకొనుము.  నీను చెప్పినట్లు చేయక నామాటను తృణీకరించిన నా ఆగ్రహమునకు గురి అయ్యెదవు సుమా" అని హెచ్చరించింది.

దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిదురలేవగానే కలలో కనిపించినదెవరో దేవతయని భావించి, చేతులు జోడించి అమ్మవారిని ప్రార్ధించి "తల్లీ అన్నీ తెలిసిన అమ్మవు. నా కష్టములు మాత్రము ఎరుగవా తల్లీ!  ఈ వ్యాపారములో ఏర్పడిన ఇబ్బందులవలన ఇంతకాలము కాలు కదుపలేకపోతున్నాను. నా మీద దయవుంచి నా చిక్కులు యెంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామమునకు బయలుదేరుతాను. భారము నీదే అమ్మా!  అని మొక్కుకున్నాడు. అతని మొర విన్న ఆ తల్లి అతనిని కరుణించింది. ఆమె అనుగ్రహమువలన వ్యాపారములో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి. రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది.  ఆ ధనమంతా మూటకట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమైనాడు.

ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలో కనిపించి "అమ్మాయి! నీభర్త నీకోసం బయలుదేరాడు.  సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగములుగా చేసి.  ఒకటి నదీ తీరమున, మరొకటి నా గుడిలో పెట్టు, మూడవది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ యింటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లు మీ అత్తగారితో, "ఓ అత్తా!  నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగావుంది, నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి, త్వరగా వచ్చి మోపు దింపుకో మెడ నొప్పిగా ఉంది, అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైనారు.

శ్రీ కరుడు నదీతీరంలో  దిగేసరికి చాలా చలిగా ఉంది.  ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన కట్టెలమోపు కనబడింది.  శ్రీకరుడు ఆ కట్టెలను మంటవేసి చలిపోగోట్టుకున్నాడు.  అక్కడ  నుండి  తన పట్టణమునకు బయలుదేరినాడు.  మార్గ మధ్యలో అతడికి  ఆకలి వేసింది.  చేరువలో సంతోషిమాత గుడి కనిపించింది.  అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన రెండవ కట్టెలమోపు కనిపించింది.  శ్రీ కరుడు సంతోషించి ఆ కట్టెలతో వంటచేసి భోజనము చేశాడు.  కొంత సేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరాడు.

శ్రీకరుడు గుమ్మము వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి బాధపడ్డాడు.  ఆమెమాటలను బట్టి తన తల్లీ, అన్నలూ, వదినలూ కలిసి ఆమెను యెంత కష్టపెడుతున్నారో అర్ధం చేసుకున్నాడు.  ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి, ఆమెను ఓదార్చాడు.  కళ్యాణిని  బాధలు పెట్టిన ఆ యింట్లో ఉండటము ఇష్టములేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి అతనూ అందులో కాపురం పెట్టినారు.  ప్రతి శుక్రవారము నాడు సంతోషిమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందముగా జీవించసాగారు.  అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయము వచ్చినది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయ్యాలనుకుంది కల్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని, ఆరుగురు తోడికోడళ్ళనూ కూడా వుద్యాపనకు రమ్మని పిలిచింది.

అయితే తోడి కోడళ్ళకి, అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు.  ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్ధాలను వండిన వంటలో కలిపినారు.   అంతటితో కల్యాణికి వ్రతం భంగమయింది. వ్రత నియమాలము విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషి మాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరున్ని బంధించి తీసుకెళ్లారు.  కల్యాణి, సంతోషిమాత పాదాలపై బడి విలపించింది.  తన భర్తను రక్షించమని ప్రార్ధించింది. పరమ కరుణామయి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది.  అందువల్ల శ్రీకరుడు బంధవిముక్తుడై యింటికి చేరాడు.  తిరిగి ఆ దంపతులు ఆనందముగా కాపురం చేసుకోసాగారు.

 ఒక సారి కల్యాణిని ఆ అమ్మవారు పరీక్షించ దలచి పిచ్చి బిచ్చగత్తెవలె  మారు వేషం ధరించి, ఓ చేత్తో బెల్లమూ ఓ చేత్తో శనగలు తింటూ, నోటివెంట చొంగ కార్చుకుంటూ రాసాగింది.  ఆమె నోటిపైన, చేతులపైన ఈగలు ముసురుతూ వున్నాయి. వికృతరూపంలో ఆమె కళ్యాణి వున్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి, దెయ్యం అని కేకలువేస్తూ రాళ్ళు రువ్వసాగారు.  పిల్లలామె మీదకు విసిరిన రాళ్ళన్నీ వెళ్లి కళ్యాణి వాళ్ళ బావలకు, తోడి కోడళ్ళకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారుపడి "అమ్మో! ఇదెవరో మాయలమారిది" లేకుంటే దానిమీదకు విసిరినా రాళ్ళు మనమీద ఎందుకు పడతాయి?  మనకెందుకు దెబ్బలు తగులుతాయి?  అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసివేసారు.

అది గమనించిన సంతోషిమాత ఆ ద్వారాలకేసి ఒక్క సారి చూసింది. ఒక్క సారిగా ప్రళయమారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపులు భళ్ళున తెరచుకున్నాయి. ఇంటిమీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లోవాళ్ళు ఆ గాలి విసురుకు సరిగా నిలబడలేక అటూ ఇటూ తూలిపడిపోయారు. ఈ దృశ్యం అంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తె రూపంలో వున్న ఆవిడను పరీక్షగా చూసినది.  ఆమె సంతోషిమాతయే అని అనిపించింది. వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై బడి "జగన్మాతా! నువ్వు నా ఆరాధ్య దైవమయిన సంతోషిమాతవే.    అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లీ!  అంటూ సవినయముగా ప్రార్థించటంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యం అయినది.

ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడికోడళ్లకు అమ్మవారిమీద నమ్మకము కలగలేదు. ఎలాగో అలా శ్రీకరుడిని, కళ్యాణిని సర్వ నాశనము చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు. చివరకు ఓ రోజున పాలల్లో విషము కలిపి కళ్యాణికి యిచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోడికోడళ్ళు ఇచ్చిన పాలను త్రాగుదాం అని అనుకుంది. అంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడే వుంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయములో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్నకొడుకు ఆకలిగా ఉంది అక్కడవున్న పాలన్నీ గబగబా తాగేశాడు. త్రాగిన వెంటనే ఆ పిల్లవాడు గావుకేకలు పెడుతూ వెంటనే నేలపై బడి చనిపోయాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడకు వచ్చింది. కళ్యాణే పాలల్లో విషము కలిపి తన కొడుకుకు ఇచ్చి చంపివేసింది అంటూ ఊరూ వాడా వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు.

అనుకోకుండా మీదపడిన ఈ హత్యానేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే, "అన్నింటికీ ఆ తల్లే ఉంది" అన్న ధైర్యముతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు.భక్తులను రక్షించడములో ఆ అమ్మవారిని మించినవారు లేరుకదా!  తన భక్తులు కంటతడిపెడితే ఆతల్లి భరించదు. అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవానిని బ్రతికించారు. ఆ కుర్రవాడు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కల్యాణిని, శ్రీకరుడిని తిట్టడము విన్న ఆ పిల్లవాడు "అమ్మా! పిన్నినీ, బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉంది ఆ పాలను నేనే స్వయముగా త్రాగాను.  అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. దానితో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తేలిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు.

దానితో విషం కలిపిన తోటికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి  కాళ్ళమీదపడి క్షమాపణ కోరుకుంది.  అప్పుడు కళ్యాణి తన తోడికోడలును క్షమించినది.  నేను క్షమించినంత మాత్రం చేత ఏంలాభం, అంతా అమ్మవారి చలవే, వెళ్లి ఆ సంతోషిమాతను క్షమాపణ వేడుకో" అని చెప్పింది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్ధించారు.

ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి వుంటూ వచ్చారు. ఓ శుక్రవారమునాడు ఏడుగురు కోడళ్ళూ కలిసి సంతోషిమాతా వ్రతం చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయింది. చక్కటి ముహూర్తములో కుమారున్ని కన్నది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషిమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు, కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులతూగారు.

ఈ కథ విన్నవారికి, చదివినవారికి కూడా ఆ సంతోషిమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. వ్రత కథ సమాప్తం. అక్షంతలు నెత్తిన చల్లుకోవాలి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.