Pages

Saraswati Vrat Katha in Telugu

Legend of Saraswati Vratham, Story of Saraswati Vrat in Telugu, Sarasvati Vrat Katha

సరస్వతీ వ్రతకథ

సూతమహాముని శౌనకాది మహామునులను చూచి యిట్లనియె, ఓ మహర్షులారా! మీకొక ఉత్తమమైన వ్రతరాజమును వినిపించెదను వినుడు అని చెప్పసాగెను.  ఆశ్వీయుజ శుక్ల పక్ష పాడ్యమి మొదలుకొని తోమ్మిదిరాత్రులు దుర్గా, లక్ష్మి, సరస్వతిలను పూజించవలెను. లేదా మూలా నక్షత్రము మొదలుకొని పూజ చేయవలెయును.
        
అనిన ఋషివర్యులు సూతమహామునితో ఓ మహాత్మా! పూర్వము ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితము కలిగినది? అని అడుగగా ఓ మునులారా!  కృతయుగంబునందు మహా ధర్మాదికుండు, ప్రజాపాలన సమర్దుండు అయిన సుకేతువు అనే రాజు గలదు.  అతనికి సౌందర్య, గాంభీర్య, యౌవన సంపన్నురాలగు సువేది అను భార్య గలదు.

ఇట్లుండగా రాజునకు, అతని జ్ఞాతులకు విరోధము సంభవించి యుద్ధ సన్నద్దుడై కదన రంగమునకు పోయి భీకరముగా యుద్దము చేయుచుండెను.  ఆ యుద్దము నందు సుకేతుడు శత్రువుల దాడికి నిలువజాలక పరుగెత్తి పోవుచుండెను.  ఇట్లు పోవుచున్న సుకేతుడిని చూసి అతని భార్య  ఓహొ ! నా నాథుడు సమరమున నిలువలేక పారిపోవుచున్నాడు నేను ఇచట నిలువఁదగదు అని సువేద భర్తను అనుసరించి వెళ్ళి పోయెను.  ఇట్లు ఇరువురు కొంతదూరము పోయి ఒక అరణ్య ప్రాంతమున ప్రవేశించి క్షుద్భాదా పీడితులగుచు నివసిస్తుండగా, కొన్ని రోజులకు ఆ రాజు వ్యాధి పీడితుడై నడచుటకు గూడా శక్తి లేక యుండెను.  అంత ఆ రాజ పత్ని భాదాతప్తురాలై భర్తను తన తొడపైన నుంచుకొని యుండగా అంగీరస మహర్షి, ఆ వనితామని చెంతకు వచ్చి యిట్లనియె.

ఓ నారీ తిలకమా! నీకు క్షేమముకలుగుగాక!  మీరు ఇరువురు ఎవరు?  ఇచ్చటికి ఎలా వచ్చితిరి?  రాజ్యంబును, బంధు జనులను ఒదిలి ఒంటరిగా ఆకలిచే పీడింపబడుచు ఈ వనమునందు ఎలా సంచరిస్తున్నారు?  అని యడుగగా ఆమెకు మాటాడుటకు నోరురాక, కన్నుల నుండి  బొటబొట కన్నీరు కార్చుచూ వెక్కి వెక్కి యేడ్చుచుండెను.

అంతట ఆ మునివర్యులు ఓ వనితా రత్నమా! బాధపడకు లోకమున ఎవ్వరుకూడా బాధపడుట వలన యే కార్యమును సాధించలేదు.  కావున మీ బాధలన్నియు తొలగిపోయే ఉపాయము చెప్పెదను.  అనగా ఆ సువేది యిట్లనియె.
             
ఓ మునివర్యా!  ఈతను నా భర్త, యితడు రాజ్య పరిపాలనము చేయుచుండగా కొద్ది రోజులకు ఇతనికిని, జ్ఞాతులకును విరోధము సంభవించెను.  అంత ఇరువురు యుద్దమును జేసిరి.  ఆ యుద్దమున శత్రువుల దాడిని తట్టుకోలేక నాభర్త యుద్దము నుండి పారిపోయి వచ్చెను, నేనుకూడా అతనివెంట వచ్చితిని.  కావునా ఓ మహాత్మా! మరల మాకు రాజ్యమును, పుత్రసంతానంబును కలుగుటకు వుపాయంబును జెప్పుమని అనేక విధములుగా ప్రార్ధించెను.  ఆపుడు అంగీరస  మహర్షి ఈవిధముగా అనెను.

ఓ పుణ్యవతి! నా వెంట రమ్ము, అతి సమీపమున పంచవటీ తటాకము నందు దుర్గా క్షేత్రము వున్నది.  అచ్చట ఆ మహా దేవిని భక్తియుక్తులతో పూజించిన నీకు మరల రాజ్యమును పుత్రపౌత్రాది సంపదలు కలుగునని చెప్పిన ఆ సువేది తన భర్తను మోసుకొని అంగీరస మహర్షి దగ్గరకు పోయెను.

ఆ మహర్షి సువేది భర్తతోడ  స్నానము చేయమనిన ఆ పతివ్రతయు స్నానము చేసి వస్త్రములను ఎండ బెట్టుకొని వచ్చినతోడనే అంగీరస మహర్షి సువేదిచే దుర్గా సరస్వతి దేవతలకు షోడశోపచారములతో పూజా చేయించెను.  ఇట్లు సువేది పాడ్యమి మొదలుకొని తొమ్మిది దినములు పూజచేసి, పదియవ దినమున వుదయముననే మేల్కాంచి, స్నానముచేసి పాయసాన్నముచే "దుర్గాదేవి" యొక్క మంత్రమును వుచ్చరించుచు హోమం చేసి ఆంగీరస మహర్షికి దంపత పూజ చేసి వారి యనుగ్రహము వలన దశదానాది వివిధ దానములను చేసి యధావిధిగా వ్రతమును పరిసమాప్తి గావించెను.

అంగీరస మహర్షి ఆశ్రమము నందు కొన్ని దినములు సుఖముగా వుండగా ఆ అమ్మవారి మహత్యం వలన సువేది గర్భము దాల్చి పదియవమాసమున ఒక పుత్రుని గనెను.  అంతటా ఆంగీరస మహర్షి ఆ బాలునకు జాతకర్మాది సంస్కారాదులను ఒనర్చి "సూర్య ప్రతాపుడు" అని నామకరణము చేసెను. ఐదు సంవత్సరములు రాగానే విద్యాభ్యాసమును చేయించెను.  అంతట ఆ బాలుడు సకల క్షాత్ర విద్యలు నేర్చుకొని యౌవనంబు వచ్చిన తోడనే ఆ మహర్షి యొక్క అనుమతి తీసుకొని, తన శత్రువులపైకి యుద్ధమునకుపోయి వారితో భీకర యుద్ధము సల్పి ఆ యుద్ధము నందు శత్రువులను తన అస్త్ర శస్త్రములచే  గడగడ లాడించి వారిని ఓడించి తన రాజ్యమును చేజిక్కించుకొనెను.  పిదప అంగీరస మహర్షి ఆశ్రమమునకు వచ్చి ఆ మునివర్యుని ఆశీర్వాదమును తీసుకొని తల్లితండ్రులను తీసుకొని తన రాజ్యమునకు వెళ్ళెను. 
            
ఆ సువేది ప్రతి సంవత్సరమును దుర్గాసరస్వతులను పూజించుచూ ఇహలోకంబున పుత్రపౌత్రాదులతో సకల సంపదలతో గూడుకొని సుఖముగా నుండి యనంతరము స్వర్గలోకప్రాప్తి  నొందెను.

ఈ వ్రతమును బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు చేయవచ్చును.  మరియు ఈ కథను వినువారును, పఠించువారును సకల పాప విముక్తులై ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి, చివరకు స్వర్గలోక పాప్తి నొందెదరు.

శ్రీ సరస్వతి వ్రతకథ సమాప్తము.